కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాపై (Illegal Sand Mafia), వైరా పోలీసులు (Wyra Police) కఠిన చర్యలు చేపట్టారు. శనివారం నిర్వహించిన వాహన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఖమ్మంకు (khammam) చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంత్ కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించిన మహీంద్రా థార్ కారు, అలాగే ఒక టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి, ఖమ్మం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు నిందితులు అంగీకరించారు. చల్లమల్ల సుమంత్ కుమార్పై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులు ఉండగా, వెంకటేశ్వరరావుపై ఈ కేసుతో కలిపి నాలుగు కేసులు నమోదయ్యాయి. గతంలో కూడా వీరు అక్రమ ఇసుక రవాణా, దొంగతనం, మోసం వంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు (Wyra Police) తెలిపారు. అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులపై హిస్టరీ షీట్లు, రౌడీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైరా డివిజన్ ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే, పర్యావరణాన్ని దెబ్బతీసే అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అక్రమ ఇసుక రవాణాపై సమాచారం అందించి చట్ట పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం
Follow Us On : WhatsApp

