కలం, నిర్మల్ : సారంగాపూర్ (Sarangapur ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పాముల సంరక్షణ, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప అటవీ క్షేత్ర అధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పాముల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
పాములు ఎలుకలు వంటి పంటలకు హాని చేసే జీవులను నియంత్రించడం ద్వారా రైతులకు మేలు చేస్తాయని, అందువల్ల వాటిని చంపకుండా సంరక్షించాలని సూచించారు. అన్ని పాములు విషసర్పాలు కావని, కొద్ది జాతులు మాత్రమే విషపూరితమైనవని వివరించారు. పాములు కనిపిస్తే భయపడకుండా అటవీశాఖ , స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ షేర్ యాసిన్ అందిస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అటవీశాఖ బీట్ అధికారులు వెన్నెల, సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

