కలం, వెబ్ డెస్క్: బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లా, కాథవాలియా గ్రామంలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిర్ సముదాయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని(Shiva Lingam) అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణలు, శంఖారావాల మధ్య శనివారం జరిగిన ఈ వేడుకలో బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ అద్భుత శివలింగం ఎత్తు 33 అడుగులు, బరువు 210 టన్నులు.
తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పట్టికాడు గ్రామంలో సుమారు పది సంవత్సరాల పాటు నిపుణులైన శిల్పులు ఒకే గ్రానైట్ శిలపై దీనిని అత్యంత కళాత్మకంగా చెక్కారు. దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ శివలింగాన్ని (Shiva Lingam) సహస్రలింగం గా పిలుస్తారు. ప్రతిష్ఠాపన మహోత్సవం కనులపండువగా సాగింది. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్రాజ్, కైలాస్ మానసరోవర్ వంటి పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో ఈ మహా శివలింగానికి హెలికాప్టర్ ద్వారా జలాభిషేకం నిర్వహించారు.


