కలం, డెస్క్ : మాజీ సీఎం జగన్ తిరుమలలో ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. తానేదో తప్పుగా మాట్లాడినట్టు క్షమాపణ అడుగుతున్నారని.. కానీ మీరే క్షమాపణ చెప్పాలి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ మోషెన్ రాజును మీరు క్రిస్టియనా అని మంత్రి అచ్చెన్నాయుడు అడగడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు (Atchannaidu) వెనక్కు తీసుకున్నారు. మండలి చైర్మన్ ను అవమానించేలా మంత్రి మాటలు ఉన్నాయంటూ వైసీపీ సభలో ఆందోళనకు దిగింది.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాను హిందూ ధర్మం గురించి మాట్లాడే క్రమంలోనే అలా అడిగానని.. తన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ‘అసలు నన్ను క్షమాపణ అడగడం ఏంటి.. నేనేం తప్పు చేయలేదు. జగన్ హయాంలోనే ఎన్నో హిందూ ఆలయాలను కూల్చేశారు. తిరుమలలో లడ్డూ నెయ్యిని కల్తీ చేశారు. జగన్ డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. దానికి వైసీపీ వాళ్లే క్షమాపణ చెప్పాలి’ అంటూ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
సభ రేపటికి వాయిదా..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైసీపీ నిరసన తెలిపింది. అటు అధికార పార్టీలు కూడా వాదనలకు దిగాయి. ఇలా సభ్యుల గందరగోళం మధ్య స్పీకర్ మండలిని రేపటికి వాయిదా వేశారు.

