కలం, వెబ్ డెస్క్: ఒడిశాకు చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ (Payal Nag) పారా ఆర్చరీలో అద్భుతాలు చేస్తోంది. చిన్నతనంలోనే విద్యుత్ షాక్ కారణంగా రెండు చేతులను కోల్పోయినప్పటికీ, ఆమె తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. ఇతరులకు భిన్నంగా విలువిద్యను కెరీర్గా ఎంచుకుంది. దేశంలోనే లింబ్స్ (చేతులు) లేని తొలి ఆర్చర్గా గుర్తింపు పొందింది. బాణాలను సంధించేందుకు ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తూ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. ఆమె 2025 నేషనల్ ఛాంపియన్షిప్లో రెండు స్వర్ణ పతకాలు, ఖేలో ఇండియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
దేశీయ స్థాయిలో సత్తా చాటిన పాయల్ నాగ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ‘వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్’ లో భారత తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. శారీరక లోపాన్ని జయించిన పాయల్ ఈ అంతర్జాతీయ టోర్నీలో సైతం పతకం సాధించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

