కలం, వెబ్ డెస్క్ : వెస్టిండీస్ దేశవాళీ క్రికెట్లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం (Sir Viv Richards Stadium) పిచ్ బ్యాటర్లకు సింహస్వప్నంగా మారింది. ఆ పిచ్పై ఆడాలంటేనే ఆటగాళ్లు బెంబేలెత్తుతున్నారు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీవార్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ (West Indies Match) లో మూడో రోజు తొలి సెషన్లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది.
ట్రినిడాడ్ పేసర్ జేడెన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఏడు వికెట్లు పడగొట్టగా, ఆయన వేసిన ఒక బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాటర్ జెర్మియా లూయిస్ హెల్మెట్కు బలంగా తగిలింది. దీంతో లూయిస్ మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్య సిబ్బంది స్పందించి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కంకషన్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పిచ్ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. క్యూరేటర్, మ్యాచ్ రిఫరీతో చర్చించిన తర్వాత పిచ్ను సరిచేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్ను రద్దు చేసి డ్రాగా ప్రకటించారు. క్రికెట్ వెస్టిండీస్ (CWI) ప్రకటన ప్రకారం, మే 17న ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్కు సురక్షితమైన పిచ్ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

