కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇతర డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు తమ విధులను బహిష్కరించారు. టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం జీవో 66 ద్వారా IAS అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో 66 IAS కమిటీని సూపర్ వైజర్ అసోసియేషన్ స్వాగతించింది.
ఈ మేరకు ప్రజా పాలన ప్రభుత్వానికి, టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ సూపర్ వైజర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.వాసుదేవ రావు ఓ నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపై చాలా సానుకూలంగా ఉందని ఈ నోట్ ద్వారా తెలిపారు. త్వరలో అన్ని సమస్యలపై పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉండటం వల్ల సూపర్ వైజర్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

