కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం అప్పుడే వివిధ దేశాలపై ప్రారంభమైంది. హార్మూజ్ జలసంధి మూసివేత, ఆయిల్ ట్యాంకర్లపై దాడులతో ప్రపంచానికి గల్ఫ్ కంట్రీస్, పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని ప్రభావం మొదట పాకిస్థాన్లో(Pakistan) మొదలైంది. దాయాది దేశంలో స్కూళ్లకు రెండు వారాల సెలవు ప్రకటించారు. అలాగే ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోమవారం ఆదేశించారు.
యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని, ఆయిల్ రేట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ప్రకారం.. ఈ వీకెండ్ తర్వాత రెండు వారాల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయనున్నారు. అలాగే, ఉన్నత విద్యాసంస్థల్లో వెంటనే ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనిచేయనున్నారు. దీనివల్ల ప్రయాణాలు తగ్గి ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే ప్రభుత్వ శాఖలకు ఇచ్చే చమురు భత్యాలను వచ్చే రెండు నెలల పాటు 50 శాతం తగ్గించనున్నట్లు ప్రభుత్వం(Pakistan) తెలిపింది. నెలకు రూ.3 లక్షలకు పైగా వేతనం పొందుతున్న గ్రేడ్–20, అంతకంటే పై స్థాయి అధికారుల రెండు రోజుల జీతాన్ని కూడా కోత విధించనున్నట్లు పేర్కొంది. మరోవైపు పార్లమెంట్ సభ్యుల జీతాలను మాత్రం 25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

