కలం, నల్లగొండ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(Suryapet Hospital)ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించగా, మొత్తం 50 మంది బోధనా సిబ్బంది, ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు.
తక్షణమే స్పందించిన కలెక్టర్, సంబంధిత విభాగాల అధిపతుల నుంచి వివరణ కోరారు. అందులో 44 మంది సిబ్బందికి సంబంధించి హెచ్ఓడీలు సహేతుకమైన కారణాలను తెలిపారు. మిగిలిన 6 మందిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లు గైర్హాజరీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు మాతా శిశు కేంద్రంలో నెలకు సగటున 240 నుండి 300 ప్రసవాలు జరుగుతుండటంపై సిబ్బందిని అభినందించారు. ఎన్ఐసీయూ సేవలు చాలా బాగున్నాయని సిబ్బందికి కితాబు ఇచ్చారు. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నతీరు పట్ల కలెక్టర్ ప్రశంసించారు.

