కలం, నల్లగొండ : ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి (Prajavani) నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ (Collector Chandrashekar) తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి ఇది కొనసాగింపుగా ఉంటుందని, డివిజన్ పరిధిలోని ప్రజలు వారి సమస్యలను ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చని తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్డీఓలను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక పై ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
డివిజన్ స్థాయి ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు అందరూ డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. డివిజనల్ పంచాయతీ అధికారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, వ్యవసాయ సహాయ సంచాలకులు, డిస్కౌం డీఈలు, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ డీఈఈలు, సీడీపీవోలు తదితర అధికారులు డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. జిల్లా అధికారులందరూ వారి శాఖకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజవాణికి వచ్చిన పిటిషన్లు అన్నింటిని ఆన్లైన్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పారు. ఫిర్యాదులన్నింటినీ సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!
Follow Us On: Instagram

