కలం, నల్లగొండ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు తనకు స్పష్టమైన హామీ ఇస్తేనే బరిలోకి దిగుతానని, లేదంటే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నేను స్వయంగా ప్రచారానికి రాకపోయినా, ఈ ప్రాంతంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించాలి” అని ప్రజలను కోరారు.
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. “నాకంటూ ప్రత్యేకంగా సొంత ఇల్లు, ఆస్తులు ఏమీ లేవు. నా జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశాను” అని ఎమోషనల్ అయ్యారు. నిరంతరం ప్రజల సంక్షేమం, నల్లగొండ అభివృద్ధి ధ్యేయంగానే తాను పనిచేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

