కలం, వెబ్ డెస్క్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బోనాల జాతర సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో సీఎం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు ఉన్న సమయంలో భక్తులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందన్నారు. జనాలు లేనప్పుడే ఉదయమే వస్తే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని సూచించారు. వీఐపీలు భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లాలి తప్ప, వారిని వేచి ఉంచే ధోరణి మానుకోవాలన్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మరింత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆలయానికి ఎంతో ఘన చరిత్ర..
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 210 ఏళ్ల ఘన చరిత్ర ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో కలర వ్యాధితో ప్రజలు చనిపోతున్న సమయంలో.. ఉజ్జయినిలో పనిచేస్తున్న ఆర్మీ అధికారి సూరటి అప్పయ్య ముదిరాజ్ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి సూరటి వంశం వారే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారని వివరించారు. గోల్కొండ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలతో తెలంగాణ మొత్తం ఈ పండుగను వైభవంగా జరుపుకుంటోందన్నారు. ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వివరించారు.

