కలం, నిజామాబాద్ బ్యూరో: నందిపేట్ మండలం గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ (Gutpa Alisagar Project) నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయకట్టు రైతులు పంపుహౌజ్ కు తరలి వచ్చారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పినా పరిష్కారం కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ విరామ సమయంలో విన్నపం..
ఈ విషయం తెలియగానే టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వెంటనే స్పందించారు. గుత్ప అలీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్కు నీటి విడుదలకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్కు నీటిని విడుదల చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ విరామ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన మహేష్ కుమార్ గౌడ్, గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను వివరించారు. ప్రస్తుత సాగు పరిస్థితులు, రైతుల అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.
నీళ్లు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు..
మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాజెక్ట్కు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో గుత్ప అల్లీ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్కు నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాజెక్ట్కు నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి లభ్యత మెరుగుపడి, పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మహేష్ కుమార్ గౌడ్కు రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

