కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్తో అభిషేక్ నిజమైన సీనియర్ ప్లేయర్గా ఎదిగాడని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీపై కేవలం 68 బంతుల్లో 135 పరుగులు చేసిన అభిషేక్ ఇన్నింగ్స్ను జాఫర్ విశ్లేషిస్తూ, గతంలో యువ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన అతడు ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఆడుతున్నాడని అన్నారు. మూడు నాలుగు సీజన్ల అనుభవంతో అతనిలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా స్పిన్నర్లపై, ముఖ్యంగా నితీష్ రాణా బౌలింగ్పై అభిషేక్ చేసిన దాడిని జాఫర్ కొనియాడారు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడుతూ మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించే సామర్థ్యం అతనిలో ఉందని చెప్పారు. ఈ సీజన్లో అభిషేక్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఏడు మ్యాచ్ల్లో 215 స్ట్రైక్ రేట్తో 323 పరుగులు చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతేడాది పంజాబ్పై చేసిన 141 పరుగుల ఇన్నింగ్స్ను గుర్తు చేస్తూ, అభిమానులు అతని నుంచి ఇలాంటి ప్రదర్శనలనే ఆశిస్తున్నారని జాఫర్ తెలిపారు. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

