కలం, కరీంనగర్ బ్యూరో: వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నందున ఈ విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత సరదా విషాదంగా మారకూడదు అని జిల్లా ఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ (Gite Mahesh Babasaheb) సూచించారు. ఈత రానివారు బావులు, చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ఈత నేర్చుకునే వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వకండి
జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించామని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వకూడదని ఎస్పీ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వచ్చీరాని డ్రైవింగ్ వల్ల మైనర్లు వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల రెండు కుటుంబాలు నష్ట పోతున్నాయని తెలిపారు. కాబట్టి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ మైనర్కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనంతో పట్టుబడిన వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

