కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్దన్నపేట మున్సిపాలిటీలో (Wardhannapet Municipality) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అధికార కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. గెలిచే వార్డు సభ్యులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి. ఏది ఏమైనా మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఊహకందని ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి.
బుధవారం 12 వార్డుల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను దృష్టిలో పెట్టుకొని గెలిచే అభ్యర్థులను తమ వైపు అంటే తమ వైపు తిప్పుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. చైర్మన్ రేస్ లో 3, 11వ వార్డులకు చెందిన సభ్యులు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న నేపధ్యంలో గెలుపొందే వార్డు సభ్యులు ఎక్కడ చేయి జారిపోతారని ఇప్పటికే వారిని అంగబలం, ఆర్థిక బలంతో లోబరచుకునే స్కెచ్ లు వేస్తున్నారు.
పలువురు వార్డు అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (Aroori Ramesh), బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తగ్గేది లేదంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చైర్మన్ పీఠం ఎవరి వశం అవుతుందనే ఉత్కంఠ వర్ధన్నపేట మున్సిపాలిటీలో (Wardhannapet Municipality) చర్చనీయాంశంగా మారింది.
Read Also: చనిపోయినా కనికరించని కులపెద్దలు.. పాడె మోసిన భార్య
Follow Us On: X(Twitter)


