కలం, వరంగల్ బ్యూరో: ఓ మహిళను నమ్మించి మోసం చేసి రేప్ చేసిన కేసులో వరంగల్ జిల్లా కోర్టు (Warangal District Court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. వరంగల్ లో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీష్ (Akuthota Sirish)కు 10 ఏళ్ల జైలు శిక్ష, అతని తండ్రి ప్రముఖ వ్యాపారి ఆకుతోట సుధాకర్ కు రూ.1000 జరిమానా విధించింది. పోలీసులు, ప్రాసిక్యూషన్ తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన ఒక వ్యాపారి ఆకుతోట సుధాకర్ కుమారుడు, 24వ డివిజన్ కార్పొరేటర్ తేజస్విని భర్త ఆకుతోట శిరీష్ తనను రేప్ చేసి వేధించాడని 2022లో ఓ యువతి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పల్లో ఈ కేసు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో నిందితుడు ఉండడంతో రాజకీయ పలుకుబడితో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ యువతి ఆందోళన చేపట్టింది. దీంతో అప్పటి మిల్స్ కాలనీ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టులో విచారణ కొనసాగగా బాధితురాలు, ఇతర సాక్షాల ఆధారంగా గురువారం తీర్పు వెలువడింది. ప్రధాన నిందితుడు ఆకుతోట శిరీష్ కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 55 వేల జరిమానా, మరో నిందితుడు ఆకుతోట సుధాకర్ కు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమలతారెడ్డి తీర్పు వెలువరించారు.

