కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం విఫలం అయిన సంగతి తెలిసిందే. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకారం తెలపలేదు. దీంతో హార్మూజ్ జలసంధిని దిగ్భంధనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ప్రపంచ దేశాలకు చమురు రవాణకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారతదేశపు చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త ఎల్పీజీ గ్యాస్ ( LPG Gas) కనెక్షన్ల మంజూరును నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశాయి.
ఈ మేరకు కొత్త కనెక్షన్ల కోసం సాగుతున్న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు నిలిపివేశాయి. ఇప్పటికే అందిన అప్లికేషన్లను కూడా పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం అందుతోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చే గ్యాస్ కనెక్షన్ల దరఖాస్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చమురు కంపెనీలు ఆమోదించకపోవడంతో ప్రభుత్వం కూడా ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసింది. కాగా, ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది.

