కలం, మహబూబ్నగర్ బ్యూరో : వనపర్తి (Wanaparthy) జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement) ప్రక్రియ విజయవంతంగా ముగింపు దశకు చేరుకుందని జిల్లా సివిల్ సప్లైస్ అధికారి కాశి విశ్వనాథ్ తెలిపారు. ఎదురైన అన్ని సవాళ్లను అధిగమిస్తూ రికార్డు స్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. మరో రెండు మూడు రోజులలో, సోమవారం నాటికి ఈ ప్రక్రియను పూర్తిగా ముగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వనపర్తి జిల్లా ధాన్యం సేకరణలో 12వ స్థానంలో నిలిచిందని అన్నారు.
42 గోడౌన్లతో ప్రత్యేక వ్యూహం
ఈసారి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లి, మొదటిసారిగా 42 గోడౌన్లను నిల్వ కేంద్రాలుగా వినియోగించుకున్నామని తెలిపారు. 62 జెన్యూన్ మిల్లులలో ధాన్యం దించగా, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా గోడౌన్లకు కూడా తరలిస్తున్నామని చెప్పారు. రైతుల ఖాతాలలో ఇప్పటివరకు రూ.358 కోట్ల చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.
లేట్ హార్వెస్టింగ్.. రవాణా సవాళ్లు
ఈసారి పంట 20 రోజుల ఆలస్యంగా రావడంతో రవాణాలో సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. అయినప్పటికీ అదనపు వాహనాలు వినియోగించి రవాణా ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ప్రతి రోజు వెబెక్స్ ద్వారా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించినట్లు వివరించారు.
గన్నీ బ్యాగుల కొరతపై క్లారిటీ
గన్నీ బ్యాగుల కొరతపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు లారీలు, బ్యాగులు మళ్లించడం వల్లే తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ధాన్యం తరుగు విషయంలో రైతులలో అపోహలు ఉన్నాయని, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులను పంపించి సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. రైతుల ప్రయోజనం దృష్ట్యా మిల్లర్లతో చర్చించి ధాన్యం దిగుమతిని కొనసాగించామని తెలిపారు.
Read Also: ‘ మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్
Follow Us On : WhatsApp

