కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ (Vinod Kumar) స్పష్టం చేశారు. బుధవారం ఆయన గోపాల్పేట మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రంతో పాటు వనపర్తిలోని చిట్యాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ధాన్యం మరింత పాడవకుండా ఉండేందుకు వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆలస్యం చేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రవాణా కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్లను త్వరితగతిన ఆన్లైన్లో అప్డేట్ చేసి రైతుల బ్యాంక్ ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ తనిఖీలలో మార్కెట్ కమిటీ అధికారులు, ఐకేపీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read Also: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఇదిగో ఫ్రీ యాప్
Read Also: డిజిటల్ విప్లవం

