కలం, వెబ్ డెస్క్: మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, శిక్షలు విధిస్తున్నా చాలామందిలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న విషయాలకే మహిళలను హింసిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్లో (Bhubaneswar) జరిగిన ఓ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక వ్యక్తి తన బైక్పై వెనుక కూర్చున్న యువతిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పదే పదే కొట్టాడు. భువనేశ్వర్లోని స్టూడియో స్క్వేర్ వద్ద ఈ ఘటన జరగ్గా, అటుగా వెళ్తున్నవారు దీనిని చిత్రీకరించారు. పట్టపగలే బహిరంగ ప్రదేశంలో ఒక మహిళపై ఇలాంటి హింసకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఈ ఘటన వేధింపులతో కూడిన సంబంధాలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మహిళలపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత, ఇలాంటి హింసాత్మక ప్రవర్తనపై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. మహిళను వేధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది.

