కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లోని PMJ జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. అయిదుగురు దుండగులు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి, ఒకరి తరువాత ఒకరు లోపలికి వచ్చారని వివరించారు. సిబ్బందిని ఆభరణాలు చూపించాలని అడుగుతూనే.. తుపాకులు తీసి బెదిరించడం ప్రారంభించారని తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో నలుగురు సిబ్బందికి గాయాలైనట్లు వివరించారు. అనంతరం, కిలో బంగారంతో పారిపోయారని స్పష్టం చేశారు. సీసీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నామని.. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.
అంతర్రాష్ట్ర ముఠా పనేనా..?
పట్టపగలు, జనసంచారం అధికంగా ఉండే చోట ఈ స్థాయిలో దోపిడీకి తెగబడిన ముఠా కచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగలుగా అనుమానిస్తున్నారు. కొద్ది రోజులు ముందు నుంచే షాపుపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా హైదరాబాద్లో జరుగుతుండేవి. ఇప్పుడు, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించడంపై జ్యువెల్లరీ షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

