కలం, వెబ్ డెస్క్ : విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసు (SaiKrishna Missing Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐ నాగరాజుపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. విజయలక్ష్మి స్వయంగా నగర పోలీస్ కమిషనర్ (CP) రాజశేఖర్బాబును కలసి ఫిర్యాదు సమర్పించగా, ఆయన దీనిని స్వీకరించి కేసు నమోదుకు ఆదేశించారు. ఈ కేసు విచారణాధికారిగా దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను నియమించారు.
మరోవైపు సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్ నేడు విజయవాడకు చేరుకోనున్నారు. ఆయన రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ సీపీ రాజశేఖర్బాబును కూడా కలవనున్నారు. అనంతరం సాయికృష్ణ అదృశ్యం కేసు నమోదైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ను నరసింహ కిశోర్ సందర్శించి, క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించనున్నారు.

