కలం, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ, రూరల్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లుతో వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) సమీక్ష నిర్వహించారు. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఆమె దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. సర్ కు బూత్ కమిటీ సభ్యులంతా సిద్ధం కావాలన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఎల్ఏలకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు.
ప్రతి ఓటును పరిరక్షించాలి..
డ్రాఫ్ట్ దశలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావని మాజీమంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందుబాటులోకి వచ్చేలోపే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించినప్పుడే ఓటు హక్కు కొనసాగుతుందనే విషయాన్ని ప్రతి ఓటరుకు వివరించాలన్నారు. సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో పనిచేసే అన్ని బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు బూత్ కమిటీ సభ్యులు, బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటును పరిరక్షించాలని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దొంగ ఓట్లను గుర్తించి వెంటనే బీఎల్వోలకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.

