కలం, స్పోర్ట్స్ : మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో ఆర్సీబీ (RCB) డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీకి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) కీలక హెచ్చరికలు చేశారు. బౌలింగ్ రూపంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2025లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ, ఈసారి ఆ విజయాన్ని పునరావృతం చేయాలంటే తమ విన్నింగ్ ఫార్ములాను కాపాడుకోవడం కీలకమని ఆకాష్ పేర్కొన్నారు. గెలిచే జట్ల వద్ద ఒక అదృశ్య శక్తి ఉంటుందని, టోర్నీ సాగుతున్న కొద్దీ తాము ఓటమి లేని జట్టు అనే భావన ఆటగాళ్లలో కలుగుతుందని చోప్రా విశ్లేషించారు. తొలి సీజన్లో సహజంగా ఏర్పడే ఆ వాతావరణాన్ని, రెండో సీజన్లో కావాలని సృష్టించడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఛాంపియన్ జట్లు పాత ఫార్ములానే మళ్ళీ వాడాలని చూస్తాయని, కానీ అది ఎప్పుడూ వర్కౌట్ కాదని తెలిపారు. ఆర్సీబీ (RCB) బౌలింగ్ యూనిట్లో ఇప్పటికే సమస్యలు కనిపిస్తున్నాయని చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన బౌలర్ జోష్ హేజిల్వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కాగా, యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు. గత ఏడాది అంచనాలకు మించి రాణించిన కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలు ఈసారి కూడా అదే ప్రదర్శనను కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సుయాష్ రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమైతే, జట్టు అతడిని తొలగించి వేరే ఆప్షన్ వైపు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాన బౌలర్లు లేని పక్షంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పాత్ర మారుతుందని చోప్రా అంచనా వేశారు. వేలంలో 5.2 కోట్ల భారీ ధర పలికిన మంగేష్ యాదవ్ మంచి ఆటగాడే అయినప్పటికీ, యశ్ దయాల్ స్థానాన్ని అతను భర్తీ చేయగలడా అనేది ప్రశ్నార్థకమని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద బెంగళూరు బౌలింగ్ యూనిట్కు ఈ సీజన్ ఒక పెద్ద సవాలు కానుందని ఆయన వివరించారు.
Read Also: యుద్ధం ఆపి.. నష్ట పరిహారం చెల్లించాలి.. ఇరాన్ కు గల్ఫ్ దేశాల డిమాండ్
Follow Us On: Instagram

