కలం, కరీంనగర్ బ్యూరో: పదేళ్ల పాలనలో నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన BRS నేతలు.. నేడు అధికారంలో లేక మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు (Velchala Rajender) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్లో BRS నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని, తెలంగాణ యువత ఆ పార్టీని ఎప్పుడో తిరస్కరించారని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్ వైఖరిపై విరుచుకుపడ్డారు.
కేటీఆర్కు KCRతో రాజీనామా చేయించే దమ్ముందా? అని రాజేందర్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత కేటీఆర్కు లేదని మండిపడ్డారు. కేటీఆర్కు నిజంగా దమ్ముంటే, అసెంబ్లీకి రాకుండా ఫామ్హౌస్కే పరిమితమైన తన తండ్రితో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయించాలన్నారు. ఆ పదవిని ప్రజల కోసం పనిచేసే బీసీ , ఎస్సీ ఎమ్మెల్యేకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సభకు హాజరు కాకుండా రూ.1.20 కోట్లకు పైగా జీతం తీసుకుంటూ ఫామ్హౌస్లో పడుకున్న నేతగా KCR రికార్డు సృష్టించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎవరి వారసత్వంతోనో రాజకీయాల్లోకి రాలేదని, ZPTC స్థాయి నుంచి స్వయంకృషి, పట్టుదలతో సీఎం స్థాయికి ఎదిగారని వెలిచాల గుర్తుచేశారు. “తండ్రి KCR నీడలో అమెరికా నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన KTR.. రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు. సీఎంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం” అని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల వైఫల్యాలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్ రావు అన్నారు. BRS పాలనలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, 317 జీవో బాధితులు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయో KTR సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతుంటే BRS నేతలకు కళ్లు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు BRSను ఎప్పుడో తిరస్కరించారని, ఇప్పుడు ఎన్ని మొసలి కన్నీళ్లు కార్చినా తెలంగాణ యువత ఆ పార్టీని క్షమించదని స్పష్టం చేశారు.

