కలం, స్పోర్ట్స్ : మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. సైప్రస్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో బుధవారం జరిగే చివరి రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ టోర్నీలో గెలిచిన వారు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన జూ వెన్జున్తో టైటిల్ పోరులో తలపడే అవకాశం పొందుతారు. ప్రస్తుతానికి భారత క్రీడాకారిణి వైశాలి రమేశ్ బాబు (Vaishali Rameshbabu), కజకిస్థాన్కు చెందిన బిబిసార అసౌబయేవా చెరి 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
13వ రౌండ్లో హోరాహోరీ
మంగళవారం జరిగిన 13వ రౌండ్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ జోంగీతో వైశాలి తలపడ్డారు. నల్లటి పావులతో ఆడిన వైశాలి ఈ మ్యాచ్ను డ్రాగా ముగించారు. ఒకానొక దశలో వైశాలికి ఆధిక్యం లభించే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ఎత్తుగడల వల్ల ఆట డ్రా వైపు మళ్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చైనా క్రీడాకారిణి జూ జినెర్ అనూహ్యంగా ఓడిపోవడం, బిబిసార విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు మారిపోయాయి.
ఫైనల్ రౌండ్ ఈక్వేషన్స్
బుధవారం జరిగే 14వ రౌండ్లో వైశాలి రష్యాకు చెందిన కటెరినా లాగ్నోతో తలపడనున్నారు. ఈ మ్యాచ్లో వైశాలి గెలిచి, బిబిసార పాయింట్లు కోల్పోతే వైశాలి నేరుగా ఛాంపియన్గా నిలుస్తుంది. ఒకవేళ వీరిద్దరూ తమ మ్యాచ్ల్లో విజయం సాధిస్తే, గురువారం టై బ్రేకర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ వైశాలి డ్రా చేసుకుని, బిబిసార గెలిస్తే టైటిల్ కజకిస్థాన్ పరమవుతుంది. అలాగే వైశాలి, బిబిసార ఇద్దరూ ఓడిపోయి జూ జినెర్ గెలిస్తే చైనా క్రీడాకారిణి విజేతగా నిలిచే అవకాశం ఉంది. గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ థిప్సే వైశాలి ఆటతీరును నిపుణులు విశ్లేషించారు. ఆమెకు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చివరి రౌండ్లో వైశాలి తెల్లటి పావులతో ఆడటం ఆమెకు కలిసివచ్చే అంశమని, అయితే ఒత్తిడిని అధిగమించి ఆడటం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

