కలం, స్పోర్ట్స్ : జింబాబ్వేతో గురువారం ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు ముందు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆత్మవిశ్వాసంగా కనిపిస్తున్నాడు. గత నాలుగు నెలల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా, తన నమ్మకం మాత్రం తగ్గలేదని ఆయన తెలిపాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో 15 ఏళ్ల వైభవ్ భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికయ్యాడు. బెల్ఫాస్ట్లో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్లో అవకాశం రాకపోయినా, మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
దీంతో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆ తర్వాతి మూడు మ్యాచ్ల్లో వైభవ్ (Vaibhav Sooryavanshi) పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. చివరి టీ20లో సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో అతనికి చోటు దక్కలేదు. ఆ సిరీస్ను భారత్ 0-4 తేడాతో కోల్పోయింది. మూడు ఇన్నింగ్స్ల తర్వాతే యువ ఓపెనర్ను తప్పించడం సరైందికాదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే వైభవ్ మాత్రం క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజమేనని భావిస్తున్నట్లు తెలిపాడు.
తన ప్రక్రియను కొనసాగిస్తూ, జట్టు కోసం ఎప్పటికప్పుడు వంద శాతం ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పాడు. ఇంగ్లండ్తో చివరి టీ20లో జట్టులో చోటు దక్కకపోవడం తనను బాధపెట్టిందని పరోక్షంగా తెలిపాడు. అయితే కోచ్లు, సహాయక సిబ్బంది తనకు అవసరమైన మార్గదర్శకత్వం, సాధనకు కావాల్సిన అన్ని అవకాశాలు కల్పించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని కూడా వెల్లడించాడు. ఈ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని వైభవ్ గుర్తుచేశాడు.
నాలుగు నెలల క్రితం ఇదే వేదికపై జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మళ్లీ అదే మైదానంలో భారత జట్టు తరఫున ఆడే అవకాశం రావడం చాలా ప్రత్యేకమైన అనుభూతిగా భావిస్తున్నట్లు తెలిపాడు. అండర్-19 ప్రపంచకప్ సమయంలో ఇక్కడి పిచ్లు, పరిస్థితులపై మంచి అవగాహన వచ్చిందని వైభవ్ చెప్పాడు. ఆ అనుభవాన్ని ఇప్పుడు జింబాబ్వే సిరీస్లో ఉపయోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఇప్పటివరకు చేసిన సాధనపై నమ్మకం ఉంచి, జట్టు విజయానికి తన వంతు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.

