కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi Chandra) డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ కుట్రలను కేసీఆర్ నాయకత్వంలో అడ్డుకున్నామని, నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ రూ. 3200 కోట్ల లాభాల బాట పట్టించారని గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో 16 వేల మందికి కారుణ్య నియామకాలు ఇస్తే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని అడ్డుకోవడం శోచనీయమన్నారు. సింగరేణి (Singareni) అక్రమాలపై కేటీఆర్, హరీష్ రావు లేఖలు రాసినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి తప్పులను నిలదీయకపోవడం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ ఖని గనులను సింగరేణికి అప్పగించాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి, కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన (Vaddiraju Ravi Chandra) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రచురించిన, పంట పొలాలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలనే పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు.
Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు
Follow Us On: Instagram

