కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) మరోసారి రాజ్యసభ అవకాశంపై తన ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించారు. ఈసారైనా రాజ్యసభకు అవకాశం తనకే ఇవ్వాలని కోరారు. రాజ్యసభ అవకాశం కోసం వీహెచ్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. వరుసగా కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ తన ఆకాంక్షను తెలుపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్నానని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తానే ముందుంటున్నా, గత పదేళ్లుగా పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేస్తున్న వారికే పదవి ఇస్తామని సీఎం అంటున్నారని, ఎలాంటి పదవి లేకపోయినా కష్టపడి పని చేస్తున్నానని, పార్టీ ఇప్పటికైనా తనను గుర్తించాలని కోరారు.
తెలంగాణ కాంగ్రెస్లో రాజ్యసభ స్థానాలపై (Rajya Sabha Seats) చర్చలు జోరుగా సాగుతున్న వేళ హనుమంతరావు (Hanumantha Rao) వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ కోసం దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కూడా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను (Rahul Gandhi) తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో వీహెచ్తో పాటు కుసుమ కుమార్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజ్యసభ స్థానాల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ వాయిదా: కొత్త తేదీలు ఇవే
Follow Us On : WhatsApp

