కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ–కర్ణాటక సరిహద్దు (Telangana Karnataka Border) ప్రాంతం జహీరాబాద్ వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్–జహీరాబాద్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు (Karnataka RTC Bus) బీదర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా, శంషల్లాపూర్ సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఉన్న మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జహీరాబాద్, బీదర్ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

