కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసరాల్లో గంజాయి (Ganja) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్ఐ రతీష్ నేతృత్వంలో కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేష్, సాగర్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి సోదా చేయగా, వారి వద్ద సుమారు 5 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు నిందితులను భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్గా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ఎస్ఐ రతీష్, బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

