కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం కోసం జరుగుతున్న భూసేకరణపై ఆయన ముని మనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ విగ్రహం (Gandhi Statue) కోసం స్థానిక ప్రజలను వారి నివాసాల నుంచి తరలించడం గాంధీ విధానాలకు వ్యతిరేకమని తుషార్ అన్నారు. దయచేసి అలాంటి చర్యలు చేపట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బాపు జీవించి ఉంటే నా పేరుతో ఇలా చేయొద్దు, వెంటనే ఆపేయండి అని చెప్పేవారని పేర్కొన్నారు. గాంధీజీ ఆలోచనలు అహింస, సామరస్యానికి ప్రతీకలని, ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడటమే ఆయన సిద్ధాంతమని తుషార్ గాంధీ గుర్తు చేశారు. ఆయన పేరుతో ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం ఆయన ఆలోచనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

