కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గే దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందాల నుండి ఏ దేశమైనా తప్పుకోవాలని చూస్తే, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తన అత్యవసర సుంకాలను కొట్టివేసిన నేపథ్యంలో, ఇతర వాణిజ్య చట్టాల ద్వారా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అమెరికాను దశాబ్దాలుగా మోసం చేస్తున్న దేశాలు ఆటలు సాగనివ్వబోమని, అలాంటి వారిపై భారీ టారిఫ్లతో పాటు లైసెన్స్ ఫీజులను కూడా విధించే అవకాశం ఉందని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు అనిశ్చితికి లోనై స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు బ్రస్సెల్స్లో యూరోపియన్ పార్లమెంట్ అమెరికాతో జరగాల్సిన వాణిజ్య ఒప్పందంపై ఓటింగ్ను వాయిదా వేసింది. అన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై ట్రంప్ 15 శాతం తాత్కాలిక దిగుమతి సుంకాన్ని విధించడమే దీనికి ప్రధాన కారణం. ఆహార పదార్థాలు, విమాన భాగాలు, మందుల తయారీ సామాగ్రి వంటి కొన్ని వస్తువులకు మినహాయింపు ఉన్నప్పటికీ, మిగిలిన వస్తువులపై ఈ భారం పడనుంది. మంగళవారం తెల్లవారుజాము నుండి ఈ కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి.

