కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో (Bhoodan Lands) ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల, వినోబానగర్లోని భూదాన్ భూముల్లో నిర్మించిన ఇండ్లను పోలీసుల సమక్షంలో భారీ భద్రత నడుమ కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసుల మోహరించారు. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, కొత్తగూడెం నుంచి అదనపు బలగాలు నగరానికి చేరుకున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈ నిర్మాణాలు జరిగాయి.
సర్వే నంబర్లు 147, 148, 149లో 60 ఎకరాల భూ దాన్ భూములు ఉండేవి. వీటిలో 30 ఎకరాల్లో 2018లో కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి పలువురు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిని మినహాయించి, మిగతా నిర్మాణాలు తొలగించాలన్న కోర్టు ఆదేశాల అనంతరం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పోలీసులు జేసీబీలు తీసుకొచ్చి నిర్మాణాలను తొలగిస్తున్నారు. ముందస్తుగా ఇళ్లల్లో ఉన్న సామాన్లను తొలగించారు. పలువురు జేసీబీలను అడ్డుకుంటున్నారు. కర్రలతో పోలీసులపై తిరగబడుతున్నారు. కోర్ట్ కేసులో ఉన్న 9 ఇండ్లను మినహాయించి మిగతా వాలటన్నింటినీ తొలగిస్తామని పోలీసులు చెప్తున్నారు. స్థానికంగా 200కు పైగా ఇండ్ల నిర్మాణం జరిగింది. వీటిలో చిన్న రేకుల షెడ్డు మొదలుకొని పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు నిర్మాణాల తొలగింపు ఎలా చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

