కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేందుకు ప్రయత్నిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల (Tummala) నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బయటికి చెప్పకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్ర విధానాల వల్ల ఆయిల్ కంపెనీలు లీటర్కు రూ.30 నష్టపోతున్నాయన్నారు. అందుకే డబ్బులు చెల్లించినా సరే, పెట్రోల్ బంకులకు ఆయిల్ సరఫరా చేయడం లేదన్నారు. దీంతో పెట్రోల్ బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందన్నారు. దీంతో అన్నదాతలతో పాటు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
కేంద్ర విధానాలతో తీవ్రనష్టం
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. అలాగే మొక్కజొన్న విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. దిగుమతులకు గేట్లు తెరవడంతో, ఇతర దేశాల నుంచి తక్కువ రేటుకు లభించే మొక్క జొన్నల తాకిడికి మన రైతులు బలవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మన రైతులు పండించే పంటలను దిగుమతి చేసుకోవడం ఆపాలని, తద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

