కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని (Nirmal) అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన రవాణా, మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి (డీఎల్సీ) ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన రహదారులు, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రయోజన ప్రాజెక్టుల అమలులో అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
మైసంపేట పునరావాస గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాల పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పునరావాస గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీఓ దేవిదాస్, డీటీడీఓ నిహారిక, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

