కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూసర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు మండలాలలో సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం హౌసింగ్, రెవెన్యూ అంశాలపై మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.
భూ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవోలకే అధికారాలు..
సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని అన్నారు. తొలివిడతలో శిధిలావస్థకు చేరిన ఎమ్మార్వో ఆఫీసులను నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని.. ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

