కలం, నిజామాబాద్ బ్యూరో: కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ (Labour Codes) అమలు చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) డిమాండ్ చేసింది. కార్మికుల హక్కుల సాధన కోసం యూనియన్ నాయకులు మంగళవారం నిజామాబాద్లో (Nizamabad) నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల జీవితాల్లో ఏప్రిల్ 1 బ్లాక్ డే మారనుందన్నారు. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు ఊడిగం చేసేలా, కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసిందని దుయ్యబట్టారు. ఈ కోడ్లు అమలైతే దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను (Labour Codes) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం వెంటనే కోడ్ల అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రవి కిరణ్, కోశాధికారి వినోద్, నాయకులు శాంతి కుమార్, విజయ్ కుమార్, రాము, విక్రమ్, నరసింగరావు, కిరణ్, రాము, నవీన్, బాలరాజ్, సాగర్ పాల్గొన్నారు.
Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?
Follow Us On : WhatsApp

