కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధి గుండా చమురు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తే, ఆ దేశం ఇప్పటివరకు చూడని రీతిలో 20 రెట్లు శక్తివంతమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ఆయన, ఇరాన్ మళ్లీ కోలుకోలేని విధంగా ఆ దేశంలోని కీలక లక్ష్యాలను ధ్వంసం చేస్తామని, అక్కడ మరణం, అగ్ని కీలలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ చర్య చైనా వంటి దేశాలకు, హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకునే ఇతర దేశాలకు అమెరికా ఇచ్చే బహుమతి అని, దీనిని అందరూ అభినందిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో (Putin) తనకు సానుకూల చర్చలు జరిగినట్లు ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం ఒక ముగింపు లేని పోరాటంలా మారిందని, ఈ యుద్ధాన్ని ముగించేలా రష్యా సహకరిస్తే అది ప్రపంచానికి మరింత మేలు చేస్తుందని పుతిన్కు సూచించినట్లు ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్య వ్యవహారాల్లో కూడా పుతిన్ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ సంభాషణ ఎంతో నిర్మాణాత్మకంగా సాగిందని ఆయన వివరించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి స్వస్తి పలకడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: కృత్రిమ కొరతకు అడ్డుకట్ట: కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Youtube

