కలం, వెబ్ డెస్క్ : అమెరికా ఇంధన రంగంలో ఒక కీలక మైలురాయి నమోదైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో సరికొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని (Texas Oil Refinery) ఏర్పాటు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటించారు. ‘అమెరికా ఫస్ట్ రిఫైనింగ్’ పేరుతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా నిలవనుంది.
ఈ భారీ పెట్టుబడిలో భారత దేశానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సహకరించిన భారత భాగస్వాములకు, రిలయన్స్ సంస్థకు ట్రంప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పన్నుల తగ్గింపు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి చర్యల వల్లే ఇటువంటి భారీ పెట్టుబడులు దేశానికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా దీనిని తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రావడమే కాకుండా, అమెరికా ఇంధన భద్రత మరింత బలోపేతం కానుంది. స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా అంతర్జాతీయ ఎగుమతులకు కూడా ఈ ప్లాంట్ కేంద్రంగా మారుతుందని ట్రంప్ (Trump) తెలిపారు.

