కలం, వెబ్ డెస్క్: ఇరాన్ తో చర్చల కోసం మరోసారి తన ప్రతినిధులెవరూ పాకిస్థాన్ వెళ్లబోరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ప్రకటించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పాకిస్థాన్ నుంచి వెళ్లిపోవడంపై స్పందిస్తూ.. చర్చల కోసం ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని ఇరాన్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. వారి నుంచి రిక్వెస్ట్ వచ్చేవరకు వైట్ హౌస్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు జేర్డ్ కుష్నర్ మాత్రం ఇస్లామాబాద్ వెళ్లబోరని స్పష్టం చేశారు.
ఉదయం నుంచి ఉత్కంఠ..
అమెరికాతో రెండో విడత చర్చల కోసమని ఈ రోజు ఉదయం పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిశారు. అనంతరం, వారితో చర్చల తరువాత ఉన్నఫళంగా తిరిగి టెహ్రాన్ పయనమయ్యారు. అప్పటివరకు ఇంకా అమెరికా నుంచి ప్రతినిధులు ఎవరూ రాలేదు. దీంతో, అసలు చర్చలు జరుగుతాయా.. లేదా.. అనే సందేహంలో అకస్మాత్తుగా ఇరాన్ మంత్రి తిరిగి వెళ్లిపోవడం గమనార్హం.

