కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించే దిశగా త్రిపుర ప్రభుత్వం (Tripura Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రూప్ సి, గ్రూప్ డి విభాగాలకు చెందిన 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసేలా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు, పరిపాలనలో పొదుపు చర్యలను అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీని ప్రకారం ప్రతి శాఖాధిపతి తమ విభాగంలోని సిబ్బంది కోసం వారాంతపు రోస్టర్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులు వారానికి ఒకరు చొప్పున వంతుల వారీగా కార్యాలయానికి హాజరవుతారు. మొదటి వారంలో కార్యాలయానికి దగ్గరగా నివసించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో సిబ్బంది ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా నిరంతరం అందుబాటులో ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పిలిచిన వెంటనే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనలు ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), స్థానిక సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలకు కూడా వర్తిస్తాయి. అయితే అత్యవసర సేవలు అందించే విభాగాలు, ఆయా సిబ్బందికి మాత్రం ఈ మినహాయింపు ఉండదు. ఇప్పటికే దక్షిణ త్రిపుర జిల్లా పరిపాలన యంత్రాంగం ఈ ఉత్తర్వులను అమలు చేయడం ప్రారంభించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

