కలం, వెబ్డెస్క్: కేరళ (Kerala)లోని అంగమాలి కిడంగూర్ మహా విష్ణు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల కోసం తీసుకొచ్చిన మయ్యనాడ్ పార్థసారథి అనే ఏనుగు బెదిరిపోయి ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మావటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఏనుగు ప్రవర్తనకు ఆలయంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయ ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాలను ఏనుగు పూర్తిగా ధ్వంసం చేసింది. కార్లు, బైక్లను తొక్కి పడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయం నుంచి ఏనుగు జనావాసల్లోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. అవసరమైతే మత్తుమందు ఇచ్చి ఏనుగును బంధించాలని నిర్ణయించారు. పోలీసులు ఏనుగు తిరుగుతున్న ప్రాంతంలోకి ప్రజలెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

