కలం, ఖమ్మం బ్యూరో: విధి ఆడిన వింత నాటకంలో ఒకేసారి తల్లిదండ్రులు కోమాలోకి వెళ్ళడం, ఉన్న ఒక్క సోదరుడు ప్రాణాలు కోల్పోవడంతో.. చెల్లి తన అన్నకు అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి రావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం (Karakagudem)లో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాజంలో సాంప్రదాయాలను పక్కనబెట్టి, ఒక చెల్లి తన అన్నకు తలకొరివి పెట్టాల్సి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఈ దారుణ పరిస్థితి విధి ఎంత బలమైనదో, ఎంత క్రూరమైనదో అద్దం పడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆడెపు సతీష్, స్వప్న దంపతులు తమ కుమారుడు మనోహర్తో కలిసి ఈ నెల 22 న భద్రాచలం ఆసుపత్రికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు మనోహర్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జీవితంలో ఎన్నో ఆశలతో, భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఉన్న ఆ యువకుడి ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిసిపోయాయి.
మరోవైపు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి పిల్లలను గమ్యానికి చేర్చాల్సిన తల్లిదండ్రులు సతీష్, స్వప్న ప్రస్తుతం ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నారు. వారు కోమా స్థితిలో ఉండటంతో, తమ కడుపున పుట్టిన కొడుకు ఇక లేడనే చేదు నిజాన్ని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఇంటి పెద్దలు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే, భవిష్యత్తుకు ఆధారంగా నిలబడాల్సిన కుమారుడు శవపేటికలో నిర్జీవంగా కనిపించడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.

