కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండల కేంద్రంలో జరుగుతున్న కేజీబీవీ నూతన భవన నిర్మాణ పనుల్లో (KGBV Construction Site) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ కూలి అక్కడి కక్కడే మరణించాడు. కరీంనగర్ (Karimnagar)కు చెందిన శ్రీనివాస్గా (30) మృతుడిని గుర్తించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మానకొండూరు మండల పరిధిలోని శ్రీనివాస్నగర్లో కేజీబీవీ నూతన భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే గురువారం కార్మికులు భవన నిర్మాణానికి సంబంధించిన ఐరన్ రాడ్లను పైకి లేపుతున్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఆ ఐరన్ రాడ్లు, సమీపంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్కు తగిలాయి. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న కరీంనగర్కు చెందిన కూలి శ్రీనివాస్ (30)కు విద్యుత్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తీవ్రత బలంగా ఉండటంతో శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. పని ప్రదేశంలో కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే శ్రీనివాస్ ప్రాణాలు తీసిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

