కలం, వెబ్డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కవిత కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల రాకను స్వాగతిస్తున్నామని, కవిత కొత్త పార్టీ పెట్టినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అయితే 2014 నుండి 2023 వరకు సాగిన బీఆర్ఎస్ దోపిడీలో కవితకు కూడా భాగస్వామ్యం ఉందని, ఆ దోపిడీపై ఆమె ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆమెకు తెలియదా అని నిలదీశారు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానంపై కవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని సెటైర్లు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగిస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. కవిత పార్టీతో పాటు రేపు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదని హితవు పలికారు. ఇదే క్రమంలో అజారుద్దీన్, కోదండరాంలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

