కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ (Allam Narayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజేఎఫ్ (TJF) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్ల తర్వాత ఆంధ్ర నేతల విగ్రహాలను తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలోనే సమైక్యాంధ్రవాదుల కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి తన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో పనిచేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. కాగా, టీజేఎఫ్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గన్పార్క్ వద్ద నిర్వహించారు.

