కలం, తిరుమలాయపాలెం: మాదకద్రవ్యాల వినియోగం, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం (Tirumalayapalem) పోలీసులు సోమవారం నార్కోటిక్ డాగ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఎస్సై కూచిపూడి జగదీష్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల పరిధిలోని సుబ్లేడ్, కాకరవాయి, ముజాహిద్పురం గ్రామాల్లో గంజాయి వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారు. గ్రానైట్ క్వారీలు, ప్రభుత్వ పాఠశాల పరిసరాలు, ఆలయ ప్రాంతాలు, మద్దెల చెరువు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ముందస్తు చర్యల్లో భాగంగా నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

