అర్ధరాత్రి ఆపరేషన్: తిరుమలలో అసలేం జరిగింది?

కలం, వెబ్ డెస్క్ : తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల రక్షణే ధ్యేయంగా అక్టోపస్ (OCTOPUS) ప్రత్యేక భద్రతా దళాలు అర్ధరాత్రి వేళ భారీ మాక్ డ్రిల్ (Tirumala Mock Drill) నిర్వహించాయి. తిరుమలలోని వెంకటాద్రి నిలయం (PAC-5) ప్రాంగణంలో ఒక్కసారిగా గన్స్‌తో సుమారు 50 మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగడంతో అక్కడ కొంత సమయం తీవ్ర కలకలం రేగింది.

భక్తులు నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేస్తే ఎదుర్కొనే పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ విన్యాసాలు సాగాయి. ఆపరేషన్‌లో భాగంగా కొందరు వ్యక్తులను ఉగ్రవాదులు బంధీలుగా చేసుకున్నట్లుగా చూపిస్తూ, వారిని సురక్షితంగా విడిపించే రెస్క్యూ ఆపరేషన్‌ను కమాండోలు విజయవంతంగా పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లను కూడా తరలించారు.

అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా జరిగిన ఈ హడావుడితో మొదట భక్తులు కొంత ఆందోళనకు గురైనప్పటికీ, అది భద్రతా విన్యాసాలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద దాడులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వివిధ భద్రతా విభాగాలు ఎలా సమన్వయంతో స్పందించాలనే అంశంపై ఈ సాధన చేశారు. అక్టోపస్ దళాలు, స్థానిక భద్రతా విభాగాలు కలిసి నిర్వహించిన ఈ కసరత్తులను పలువురు భక్తులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. కొండపై భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, భక్తుల్లో పూర్తి భద్రతా భావాన్ని, ధైర్యాన్ని నింపేందుకే ఈ ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>